కర్ణాటకలోని తుమకూరు జిల్లా అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రికార్డు సృష్టించనుంది. ఇక్కడ ఏటా సుమారు 300 ఎకరాల్లో కొత్తగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటవుతున్నాయి. జవహర్లాల్ నెహ్రూ జాతీయ సౌర పథకం ప్రకారం 2022 నాటికి 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర విద్యుత్ సంస్థ కేఎస్పీడీఎల్ 2,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పావగడ తాలూకాలో సౌర ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. నగల్మాదికె, హొబ్బళి, వల్లూరు, బాలసముద్ర, తిరుమణి, రాయచర్లు, క్యాతగణచర్ల గ్రామాల్లోని రైతుల నుంచి 13 వేల ఎకరాలను 25 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకుంది. 11 వేల ఎకరాల్లో ఇప్పటికే సౌర ఫలకలను ఏర్పాటు చేసింది. నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్గా ఇది పేరుగాంచనుంది. పావగడ ప్రాజెక్టును మొత్తం 8 సెక్టార్లుగా విభజించింది. ఒక్కో సెక్టార్ సామర్థ్యం 250 మెగావాట్లు. కర్ణాటక సౌర విద్యుత్ అభివృద్ధి సంస్థ (కేఎస్ పీడీసీఎల్), కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (కేఆర్ఐడీఎల్)ల ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు అమలవుతోంది.
|
No comments:
Post a Comment