కరెంట్ అఫైర్స్ సెప్టెంబరు - 10

సెప్టెంబరు - 10
¤ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) 42వ సమావేశం జెనీవాలో జరిగింది. ఈ సందర్భంగా కశ్మీర్‌లో పరిస్థితులపై అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలంటూ పాకిస్థాన్‌ కోరింది. జమ్మూ కశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు నిర్ణయం భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని భారత్‌ స్పష్టం చేసింది. ¤ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) జాన్‌ బోల్టన్‌ను పదవి నుంచి తప్పించారు. తాలిబన్‌ ప్రతినిధులతో క్యాంప్‌ డేవిడ్‌లో రహస్యంగా భేటీ కావాలన్న తన నిర్ణయాన్ని బోల్టన్‌ వ్యతిరేకించడంతో ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.¤ బ్రిటన్‌లో ఆకస్మిక ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చేసిన ప్రతిపాదనను ఆ దేశ పార్లమెంట్‌ తిరస్కరించింది. బ్రెగ్జిట్‌ ఒప్పందంలో మార్పులు లేకపోతే బ్రిటన్‌కు జరిగే నష్టానికి సంబంధించిన పత్రాలను విడుదల చేయాలంటూ ప్రధాని చేసిన డిమాండ్‌ను కూడా పార్లమెంట్‌ తోసిపుచ్చింది. బ్రెగ్జిట్‌పై అక్టోబరు 31 లోగా ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉండగా ఇప్పటికీ ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యపడలేదు. ¤ నేపాల్‌కు పెట్రో ఉత్పత్తులను సరఫరా చేసే పైప్‌లైన్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్‌ ప్రధాని కేపీ ఓలీ వీడియో లింక్‌ ద్వారా ప్రారంభించారు. భారత్‌ నిర్మించిన తొలి అంతర్జాతీయ పైప్‌లైన్‌ ఇదే. 1973లో కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్‌ ఇప్పటి వరకూ పెట్రో ఉత్పత్తులను ట్రక్కుల ద్వారా నేపాల్‌కు తరలించేది. ఇకపై బిహార్‌లోని మోతిహారి, నేపాల్‌లోని అమ్లేఖ్‌గంజ్‌ల మధ్య సుమారు 69 కి.మీ. పొడవునా ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌ ద్వారా పెట్రో ఉత్పత్తులను సరఫరా చేయనున్నారు. ఈ మార్గం ద్వారా నేపాల్‌కు ఏటా సుమారు 20 లక్షల టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు సరఫరా కానున్నాయి.

No comments:

Post a Comment